సామూహిక అక్షరాభ్యాసం మన పాఠశాలలో ఈ ఏడాది చాలా ఘనంగా జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించే విషయంలో మన శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇటు ప్రభుత్వ... అటు ఎయిడెడ్ పాఠశాలల్లో మనమే ముందుంటున్నాం. ఈ ఏడాది మన పాఠశాల్లో జరిగిన సామూహిక అక్షరాభ్యాసానికి కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ ఏ ఎస్ రామకృష్ణ గారు ముఖ్య అతిధిగా విచ్చేయగా... మన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీనివాసులరెడ్డిగారు ప్రత్యేక అతిధిగా వచ్చేశారు. ముందుగా మన పాఠశాల సంప్రదాయానుసారం తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి తెలుగు తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ రామకృష్ణ గారు... జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసులరెడ్డిగారు పూలమాలలు వేశారు. అనంతరం పాఠశాల్లో సరస్వతి పూజను నిర్వహించి అత్యంత ఘనంగా వైభవంగా సామూహిక అక్షరాభ్యాసాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామకృష్ణ గారి చేతుల మీదుగా చేయించడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ రామకృష్ణ గారు మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్దుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పట్టుమని పది మంది కూడా చేరడం లేదని అటువంటిది శ్రీ సరస్వతి కమిటీ స్కూల్లో 55 మంది విద్యార్దులు చేరడం అభినందనీయమని అన్నారు. చదువు బాగా చెపుతున్నారనే నమ్మకం తల్లిదండ్రులకు కల్పిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తారని రామకృష్ణ పేర్కొన్నారు. అందుకు చక్కని ఉదాహరణే సరస్వతి కమిటీ స్కూలని ప్రశంచించారు. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఎయిడెడ్ విద్యార్దులకు కూడా ఏకరూపు దుస్తులు అందజేయాలని నిర్ణయించిందని వెల్లడించారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఉత్తమ పాఠశాలల్లో శ్రీ సరస్వతి ఎయిడెడ్ స్కూలు ముందుంటుందని అన్నారు. ప్రతి ఏడాది సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గతంలో తాను ఇదే పాఠశాలలో విద్యార్దులు, ఉపాధ్యాయుల హజరు నమోదుకై బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించినట్లు గర్తు చేసుకున్నారు. బయోమెట్రిక్ విధానం కూడా జిల్లాలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎయిడెడ్ పాఠశాలగా సరస్వతి కమిటీ స్కూలు నిలిచిందని పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసుల రెడ్డి అభినందించారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడం వల్లనే సరస్వతిలో విద్యార్దుల సంఖ్య ఎప్పుడు తగ్గడం లేదని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి లగడపాటి రామలక్ష్మి, పాఠశాల అకడమిక్ అడ్వైజర్ శ్రీమతి వరలక్ష్మి, రెడ్ ఎఫ్ ఎమ్ మేనేజర్ శ్రీనివాసరావు, డీటీఎఫ్ నాయకులు అంజిరెడ్డి, యాదవ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ అంజయ్య, రాఘవేంద్ర ప్రభు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రవీంద్రబాబు, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు శ్రీమతి విజయలక్ష్మి, గోవిందరెడ్డి, ప్రమీల, నాగమ్మ, రవి, దీనా, వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.
 |
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి